Wednesday 29 June 2011

రైతు వ్యతిరేక ప్రభుత్వమిది.. కళ్లు తెరిపిద్దాం రండి : టీడీపీ


రైతు వ్యతిరేక ప్రభుత్వమిది.. కళ్లు తెరిపిద్దాం రండి : టీడీపీ

అనంతపురం, జూన్ 28 : రాష్ట్రంలో కొనసాగుతున్నది రైతు, పేదల వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ జిల్లా నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, పెనుగొండ, ఉరవకొండ ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, పయ్యావుల కేశవ్, అనంతపురం ఇన్‌చార్జి మహాలక్ష్మి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ అనేక ఆందోళనలు చేపట్టినా గుడ్డి ప్రభుత్వం రైతులపట్ల వివక్ష వీడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ రాక్షస పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.

అందుకే బుధవారం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తున్నామని రైతులు, ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ, నగర అధ్యక్షుడు కృష్ణకుమార్, సరిపూటి రమణ, మణికంఠబాబు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

కలెక్టరేట్ ముట్టడి ఇలా...
టీడీపీ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కొత్త పంథాలో నిర్వహించనున్నారు. వేలాది మందితో నేతలు తొలుత పాతవూరులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడ మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.

అటు నుంచి గాంధీ బజార్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ ధర్నా నిర్వహించి ఎలాంటి ప్రసంగాలు లేకుండా కలెక్టరేట్‌ను ముట్టడిస్తారు. వివిధ నియోజకవర్గాల నుంచి వేలాదిమంది ఈ ముట్టడిలో పాల్గొనడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

చెన్నేకొత్తపల్లిలో...
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, రైతులను మోసం చేస్తున్న ఈ దగాకోరు ప్రభుత్వాలను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని దేశం ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బీకే పార్థసారధి ధ్వజమెత్తారు. రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే సునీత ఆధ్వర్యంలో మంగళవారం సీకే పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ముందుగా స్థానిక బస్టాండ్ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. అక్కడ బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం వంటగ్యాస్, కిరోసిన్, డీజల్ ధరలను అమాంతంగా పెంచిందని దుయ్యబట్టారు. జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న వైఎస్ఆర్‌పార్టీ అధినేత పై కూడా ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

లక్షలకోట్ల ప్రజాధనాన్ని దోచుకొని ఓదార్పుయాత్రంటూ గ్రామాల్లో తిరుగుతూ ప్రజల ముందు ముసలికన్నీరు కారుస్తున్నారని, ప్రజలెవరూ జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పార్థసారధి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం, కేంద్రంలో అస్తవ్యస్తపాలన కొనసాగుతోందని విమర్శించారు.

ఇక జగన్ ఓదార్పుయాత్రపై ఆయన మాట్లాడుతూ అవినీతి చక్రవర్తి కుమారుడైన జగన్ చేస్తున్న యాత్ర ఓదార్పుయాత్ర కాదని, రాజకీయ యాత్ర అని పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ఆదినారాయణకు సమర్పించారు. ఈ ధర్నాలో రామగిరి జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, ఎంపీపీ రంగయ్య, మండల కన్వీనర్లు దండు ఓబుళేశు, రఘువీరా, నెట్టెం వెంకటేశు, వేణు, రామాంజినేయులు, ప్రధాన కార్యదర్శి పరంధామయాదవ్, రూరల్ జడ్పీటీసీ గంగాధర్‌రెడ్డి, వెంకటనారాయణ, వెంకటేశుగౌడ్, వెంకటరాముడు, మరూరు గోపాల్, శ్రీరాములు నాయక్, మాడెం సూర్యనారాయణరెడ్డి, బాబులాల్, రఘునాథరెడ్డి, అంకే ఆంజనేయులు, గేటు కిష్టప్ప, న్యామద్దల కిష్టప్ప, విజయ్, తాతన్నగారి రామచంద్రారెడ్డి, వెంకటాచారి, డిష్ వెంకటేశు, బొగ్గు కిష్ట, శ్రీరాములు, రామకృష్ణారెడ్డి, రాము, నరసింహులు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళలు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్యాస్ ధరల పెంపుపై నిరసన..
కాంగ్రెస్ పాలకులు వంటగ్యాస్ ధరలు పెంచి మహిళలను కట్టెల పొయ్యికి పరిమితం చేస్తూ వారి కంట నీరు పెట్టిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధ్వజమెత్తారు. గ్యాస్‌ధరల పెంపును నిరసిస్తూ మండల కేంద్రమైన చెన్నేకొత్తపల్లిలో ఎమ్మెల్యే నడిరోడ్డుపై వంటావార్పు చేపట్టారు.

తహసిల్దార్ కార్యాలయం ఎదుట రో డ్డుపై కట్టెలపొయ్యి పెట్టి వంటచేశారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతోపాటు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment