Tuesday 16 August 2011

జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ రెడీ


ముప్పేట దర్యాప్తు!
జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ రెడీ
చిత్తు ప్రతిని ఢిల్లీ తీసుకెళ్లిన సీబీఐ అధికారులు

నేడో రేపో ఎఫ్ఐఆర్ జారీ చేసే అవకాశం
దేశ రాజధాని నుంచే అధికారిక ప్రకటన!
జగన్ కేసు విచారణకు ఎండీఐటీ?
ఎమ్మార్ కేసులోనూ ఎఫ్ఐఆర్ సిద్ధం
మళ్లీ సుప్రీం మెట్లెక్కిన జగన్
బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయొద్దు
మా వాళ్లను అరెస్టు చేయవద్దు
హైకోర్టు తీర్పును నిలిపివేయండి
మళ్లీ దానిని హైకోర్టుకు పంపొద్దు
మీ దగ్గరే పెండింగ్‌లో ఉంచండి
సుప్రీంకు జగన్ మొర
హైదరాబాద్, ఆగస్టు 16: కడప ఎంపీ వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు ఎఫ్ఐఆర్ జారీకి సీబీఐ రంగం సిద్ధం చేస్తే.. హైకోర్టు తీర్పును నిలిపి వేయాలంటూ జగన్ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. జగన్ కేసు విచారణకు బహుళ వ్యవస్థల దర్యాప్తు బృందాన్ని (మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్-ఎండీఐటీ) ఏర్పాటు చేయడానికి సీబీఐ పావులు కదుపుతుంటే.. తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయవద్దని, తమ వాళ్లను అరెస్టు చేయవద్దని జగన్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

హైకోర్టు తీర్పును నిలిపి వేయాలని విన్నవించారు. అయితే.. జగన్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు, తమ వాదనలు వినాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో, జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ మరోసారి ఊపందుకుంది. ఇక, ఎమ్మార్ సంస్థ కూడా జగన్ బాటలోనే నడిచింది. తమ సంస్థపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ సీబీఐని రాష్ట్ర హైకోర్టు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

జగన్ అక్రమ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అవకతవకల వ్యవహారంపై సిద్ధమవుతున్న ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను బుధ, గురు వారాల్లో జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీబీఐ అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో అనేకమంది వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉండడంతో ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో సీబీఐ అధికారులు ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నట్లు తెలిసింది.

ఈ రెండు కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ చిత్తు ప్రతి సిద్ధమైందని, దానిని తీసుకుని సీబీఐ ఉన్నతాధికారుల బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లిందని తెలిసింది. చిత్తు ప్రతిని సీబీఐ డైరెక్టర్‌కు చూపించిన తర్వాత, బుధ, గురు వారాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, జగన్ అక్రమ ఆస్తులు, ఎమ్మార్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి సీబీఐ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సత్యం రామలింగరాజు కేసు విచారణ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎండీఐటీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అదే విధంగా, ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ఎండీఐటీని ఏర్పాటు చేయాలని సీబీఐ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయ పన్ను శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఆడిటింగ్ , సెబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో ఎండీఐటీని ఏర్పాటు చేస్తే దర్యాప్తు వేగవంతమవుతుందని సీబీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి మంత్రి శంకర్‌రావు ఇటీవల సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎండీఐటీ ఏర్పాటు తథ్యమనే సంకేతాలు ప్రభుత్వ వర్గాల ద్వారా వస్తున్నాయి. ఎండీఐటీ ఏర్పాటు.. ఎఫ్ఐఆర్ జారీకి సంబంధించి అధికారిక ప్రకటన ఢిల్లీ నుంచి సీబీఐ డైరెక్టర్ చేయవచ్చని తెలుస్తోంది.

మరోసారి సుప్రీంకు
తన కంపెనీల్లో పెట్టుబడులు, తన ఆస్తులు, సంపాదనలపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు కాకుండా నిలిపి వేయాలని జగన్ మంగళవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను నేరస్తుడిగా నిర్ణయించిన హైకోర్టు తీర్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు నివేదించకుండా సుప్రీంలోనే పెండింగ్‌లో ఉంచాలని కోరారు.

న్యాయస్థానం తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయవద్దని, ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీల అధికారులను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించాల్సిందిగా అభ్యర్థించారు. హైకోర్టు తన తీర్పులో ఎలాంటి నిర్దిష్ట నిర్థారణలకు రాలేదని, కేవలం సాధారణ వ్యాఖ్యలే చేసిందని తెలిపారు. సీబీఐ ప్రాథమిక దర్యాప్తుపై తన వాదనలను వినకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రికార్డులను కోరకుండానే తీర్పు వెలువరించిందని చెప్పారు.

హైకోర్టు తనను తాను పరిశోధక సంస్థ పాత్రలో నియమించుకుందని, తనను నేరస్థుడిగా నిర్థారించిందని విమర్శించారు. సీబీఐ దాఖలు చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను కూడా హైకోర్టు కనీసం తనకు ఇవ్వలేదని, సీల్డు కవర్‌లో ఉన్న నివేదికను తెరిచి తిరిగి సీలు చేసిందని ఆరోపించారు. సీల్డు కవర్‌ను హైకోర్టు తాను మాత్రమే తెరవడమే కాకుండా, తన తీర్పుకు సీబీఐ నివేదిక ఆధారం కాదని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. 

No comments:

Post a Comment